Latest Posts

ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తమ కీలక ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా కీలక ముందడుగు వేసింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నేడు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు.

 

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. గుర్తింపు కార్డు చూపించి ఈ సేవలను వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,458 బస్సులను ఈ పథకం కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు.

 

‘స్త్రీ శక్తి’ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.2,000 కోట్లు ఖర్చు చేయనుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం కేవలం ఉచిత ప్రయాణానికే పరిమితం కాదని, మహిళలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, స్వేచ్ఛను అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రతీ మహిళకు నెలకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఆదా అవుతుందని అన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి బస్సులో సీసీ కెమెరాలు, సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్ని అవరోధాలనైనా అధిగమించి, ‘సూపర్ సిక్స్’ పథకాలను సమర్థంగా అమలు చేసి చూపిస్తుందని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళల తరఫున సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, అమరావతి అభివృద్ధికి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Posted Under AP
Editor