వారం రోజుల క్రితం బీఆర్ఎస్కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీలో చేరారు. హైదరాబాద్, నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ రామచందర్ రావు కాషాయ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. గువ్వల బాలరాజుతో పాటు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన మరి కొందరు నేతలు, కార్యకర్తలు కూడా బీజేపీలోకి చేరారు.
కాగా.. రోజురోజుకీ గులాబీ పార్టీకి బిగ్ షాక్ లు తగులుతూనే ఉన్నాయి. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరి కొందరు నేతలు బీజేపీలోకి చేరనున్నట్టు టాక్ వినిపిస్తోంది. గులాబీ బీస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న గువ్వల బాలరాజు అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తాకింది. గువ్వల రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించిన విషయం తెలిసిందే. గతంలో తనపై దాడి జరిగిందని.. ఆ సమయంలో బీఆర్ఎస్ హైకమాండ్ తనను పట్టించుకోలేదని ఆయన చెబుతున్నారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లనే రాజీనామా చేసినట్టు గువ్వల చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరుతారనే దానిపై గత వారం రోజులుగా ఉత్కంఠ నెలకొంది. దీంతో నేడు ఆ ఉత్కంఠకు తెరపడింది. ఫైనల్ గా గువ్వల ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడిందని చెప్పవచ్చు. మొదటి నుంచి ప్రచారం జరిగినట్లుగానే ఆయన ఇవాళ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ రామచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
పార్టీలో చేరిన అనంతరం గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీపై, మాజీ మంత్రి కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ కు, తనకు వయస్సులో ఆరు నెలలు మాత్రమే తేడా అని అన్నారు. కేటీఆర్ నన్ను బచ్చా అనడం కరెక్ట్ కాదని ఆయన ఫైరయ్యారు. కేసీఆర్ కు సీఎం పదవి దళితులు పెట్టిన భిక్ష అని తాను అనలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పాలన నచ్చే బీజేపీలో చేరానని గువ్వల బాలరాజు చెప్పుకొచ్చారు.
