కార్యకర్తలకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ..

తన నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త తెలిపారు. పార్టీ కార్యకర్తల కోసం ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. తనను నమ్ముకున్న కార్యకర్తల రుణం తీర్చుకుంటానని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలను ఆదుకునేందుకు సొంత నిధి ద్వారా ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

 

నెల్లూరులో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో 175 మంది కార్యకర్తలకు రూ.45 లక్షల రూపాయల చెక్కులను తన సతీమణి రమాదేవితో కలిసి మంత్రి నారాయణ పంపిణీ చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఏటా రూ.10 కోట్లు చొప్పున, ఐదేళ్లకు రూ.50 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

 

తన విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టానని ఆయన తెలిపారు. వారికి ఏ కష్టం వచ్చినా 24 గంటలూ అందుబాటులో ఉంటానని అన్నారు. కార్యకర్తలు, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

 

నెల్లూరు నగర సమగ్రాభివృద్ధికి పక్కా యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇకపై స్వీపింగ్ యంత్రాలతో రోడ్లను శుభ్రం చేస్తామని తెలిపారు. నగర పాలక సంస్థకు 28 యంత్రాలను అందించడం జరిగిందన్నారు. నెల్లూరులో 5 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Posted Under AP
Editor