మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ఇంఛార్జీగా రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు పార్టీ అధినేత కేసీఆర్. అంతేగాక, వరంగల్లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమన్నారు కేసీఆర్.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా బీఆర్ఎస్ తరఫున పూర్తిగా పోరాటం చేస్తామని కేసీఆర్స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని రాజయ్యకు సూచించారు. అదేవిధంగా వరంగల్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ విజయం కోసం పని చేయాలని రాజయ్యను కేసీఆర్ కోరారు.
మరిన్ని చేరికలకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో 15 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. నోవాటెల్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై, ప్రచార వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నేతలను అడ్డుకోవద్దని వేణుగోపాల్ స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో చేరికలకు నియంతలా కొందరు అడ్డొస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ మారినవారిని తిరిగి చేర్చుకోవాలన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వొద్దన్నారు. కష్టపడి పనిచేస్తే అన్ని ఎంపీ సీట్లు గెలవొచ్చన్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
