Latest Posts

మరో రెండు స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన.. ఆ ఇద్దరు ఎవరంటే..

తాజాగా ప్రకటించిన రెండు స్థానాలు నాగర్‌కర్నూల్‌(ఎస్సీ), మెదక్‌ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. నాగర్‌ కర్నూల్‌ నుంచి బీఎస్పీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌కు టికెట్‌ ఇచ్చారు. మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రనకటించారు. ప్రవీణ్‌కుమార్‌ ఇటీవలే బీఎస్సీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. వెంకట్రామిరెడ్డి మూడేళ్ల క్రితం కలెక్టర్‌గా రిటైర్‌ అయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

 

పోటీకి చాలా మంది దూరం..

బీఆర్‌ఎస్‌ నేతలు చాలా మంది ఆ పార్టీ టికెట్‌పై పోటీకి నిరాకరిస్తున్నారు. ఈక్రమంలోనే సిట్టింగ్‌ ఎంపీలు వెంకటేశ్‌నేత, రాములు, బీబీపాటిల్‌ బీజేపీలో చేరారు. ఇక వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్, చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే క్యాడర్‌ అభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ టికెట్‌ అడిగేవారు లేకపోవడంతో ఎంపిక చేసిన అభ్యర్థులకు కూడా అసమ్మతి బాధ లేదు.

 

మొదటి జాబితాలో వీళ్లు

బీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో ఖమ్మం నామానాగేశ్వర్‌రావు. మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, మహబూబ్‌నగర్‌ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించారు. తర్వాత రెండో జాబితాలో చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, జహీరాబాద్‌ నుంచి గాలి అనిల్‌కుమార్, వరంగల్‌ నుంచి కడియం కావ్యను ప్రకటించారు. తర్వాత మూడో జాబితాలో ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు, మల్కాజిగిరి నుంచి లక్ష్మారెడ్డి పోటీ చేస్తారని కేసీఆర్‌ ప్రకటించారు. తాజాగా మెదక్‌ సీటు వెంకట్రామిరెడ్డికి, నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌కు ఇచ్చారు.

Editor