భవ్య రామమందిరాన్ని దర్శించుకునే భక్తులు, పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రద్దీ ఫలితంగా అయోధ్యకు తరలివచ్చే వాహనాలు, ట్రాఫిక్ నియంత్రణ కష్టమవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం సిటీని అభివృద్ది చేయడంపై దృష్టి పెట్టింది.
ఇందులో భాగంగా అయోధ్యకు మూడు కొత్త రహదారులు వేయనున్నారు. లక్షణ్ పథ్, అవధ్ ఆగమన్ పథ్, క్షీరసాగర్ పథ్గా వాటికి నామకరణం కూడా చేశారు. కొత్త రోడ్ల పనులు త్వరలోనే ఆరంభం కానున్నాయి. లక్ష్మణ్ పథ్ ను 6.7 కిలోమీటర్ల పొడవు మేర నాలుగు లేన్లలో గుప్తార్ ఘాట్ నుంచి రాజ్ఘాట్ వరకు నిర్మిస్తారు.
క్షీరసాగర్ పథ్, రామ్పథ్లను అనుసంధానిస్తూ 300 మీటర్ల పొడవున అవధ్ ఆగమన్ పథ్ నిర్మాణం జరుగుతుంది. ఇక మూడో రహదారి క్షీరసాగర్ పథ్ 400 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రస్తుతం అయోధ్యలోని రామజన్మభూమికి నాలుగు రహదారులు ఉన్నాయి.
రామ్పథ్ 13 కిలోమీటర్ల పొడవు ఉండగా.. బిర్లా ధర్మశాలను, రామజన్మభూమిని కలుపుతూ జన్మభూమి పథ్ ఉంది. వీటితో పాటు భక్తి పథ్, ధర్మపథ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. గత నెల 22న భవ్య రామమందిరం ఆరంభమైన అనంతరం భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయితే అయోధ్యలో ట్రాఫిక్ కష్టాలకు తెరపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
