తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆటోవాలాలు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటామని చెబుతున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట నిరసన తెలుపుతున్నారు. గురువాసం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజాభవన్ ఎదుట ఓ ఆటో ఆగింది. అందులో నుంచి దిగిన డ్రైవర్ ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆటో అగ్నికి ఆహుతైంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ కూడా కాలిపోతున్న ఆటోవైపు వెళ్తుండగా పోలీసులు అతడిని పక్కకు లాగేశారు. ఈ దృశ్యాన్ని చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. ఆటో డ్రైవర్ను మియాపూర్కు చెందిన దేవ్లా నాయక్గా గుర్తించారు.
మహిళలకు ఉచిత ప్రయాణంపై నిరసన..
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిచండంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని ప్రజాభవన్ ఎదుట నిరసన తెలిపినట్లు దేవ్లానాయక్ తెలిపాడు. తన కళ్ల ఎదటే కాలిపోతున్న ఆటోను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు, భార్య ఉన్నారని చెప్పాడు. ఆటోనే నమ్ముకుని పదేళ్లుగా జీవనం సాగిస్తున్నానని, మహిళలకు ఫ్రీ బస్ కారణంగా ఉపాధి దెబ్బతిన్నదని ఆవేదని వ్యక్తం చేశాడు. గతంలో రోజుకు రూ.2 వేలు వచ్చేవని ఇప్పుడు రూ.500 కూడా రావడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోడం లేదని తెలిపాడు.
