ఏపీలో ఎన్నికల కసరత్తు మొదలైంది. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఇటు ఎన్నికల సంఘం ఏపీలో పర్యటనకు వస్తోంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షకు నిర్ణయించింది. బోగస్ ఓట్ల పైన ఫిర్యాదుల విషయంలోనూ నిర్ణయం తీసుకోనుంది. ఫిబ్రవరి 15-20 మధ్య ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఇటు సీఎం జగన్ అభ్యర్దుల మార్పుతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. అటు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పైన త్వరలో ప్రకటన చేయనున్నారు. ఇక అన్ని పార్టీలు ఫిబ్రవరి ద్వితీయార్ధంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. దీనికి తగినట్లుగానే కేంద్రం ఎన్నికల సంఘం టీం ఏపీకి వస్తోంది. ఈ రాత్రి విజయవాడ చేరుకోనున్న టీం సభ్యులు రెండు రోజులు అధికారులతో సమీక్షలు నిర్వహించన్నారు. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు పైన సూచనలు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు..సిబ్బంది వివరాలను సేకరించింది.
ఇక..ఏపీలో బోగస్ ఓట్ల అంశం పైన టీడీపీ, వైసీపీ పోటా పోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసాయి. వీటి పైన ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. ఎన్నికల సంఘం అధికారులు ఈ 23న జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో పాటు ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. బోగస్ ఓట్ల పైన..ఎన్నికల విధుల కేటాయింపు పైన అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలు వంటి విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో ఎన్నికలు అనుకున్న సమయం కంటే ముందుగానే వచ్చే అవకాశాలున్నాయని అందుతున్న సమాచారంతో పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ పర్యటన వేళ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది
