తెలంగాణ ప్రభుత్వం వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తోంది. అర్దిక పరిస్థితిపైన శ్వేత పత్రం ప్రకటించిన ప్రభుత్వం..ఈ రోజు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి, ధీంట్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాలనే ఆలోచనతో శ్వేత పత్రాన్ని ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ శాఖ కు రూ 81,516 కోట్లు ప్రస్తుతం అప్పులు ఉన్నట్లు తేల్చారు.
శ్వేతపత్రం విడుదల : తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితుల పైన ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించింది. రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉందని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. విద్యుదుత్పత్తి సంస్థ (జెన్ కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్ కో), ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఉన్న 81 వేల కోట్ల రుణాలు, రూ 50 వేల కోట్లకు పైగా నష్టాలు, గత తొమ్మిదిన్నారేళ్లలో తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. దీని పైన సభలో చర్చ ప్రారంభమైంది. నాటి మంత్రి జగదీశ్ రెడ్డి 2014 నాటికి జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తులు రూ 44,344 కోట్లు కాగా, రూ 22,423 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు వివరించారు.
అప్పులు – ఆస్తులు : ప్రస్తుతం విద్యుత్ రంగ ఆస్తులు రూ 1,37,570 కోట్లుగా కాగా, అప్పులు రూ 81,516 కోట్లు ఉన్నాయని చెప్పారు. తమ హయాంలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామని..24 గంటల విద్యుత్ అందించామని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సస్ జగదీష్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పురోగతి, అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలకపాత్ర పోషిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే వెన్నెముకని అన్నారు. మొత్తంగా చూస్తే ఆర్థిక, నిర్వాహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టిగా ఉండడం రాష్ట్ర మనుగడకు చాలా అవసరమని అన్నారు.
ప్రమాదకరం : రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, డిస్కంలు రూ. 81 వేల 516 కోట్ల నష్టాల్లో ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ. 28,673 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ. 28,842 కోట్ల బకాయిలను డిస్కంలకు చెల్లించాల్సి ఉందని, రూ. 14,193 కోట్లు సాగునీటి శాఖ బకాయి ఉందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులకు ఈ బకాయిలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 14,928 కోట్ల సర్దుబాటు ఖర్చులు చెల్లించక పోవటం డిస్కంల ఆర్థిక పరిస్థితిని కుంగ దీసిందని, దీంతో రోజువారి విద్యుత్ మనుగడకు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్న వాటిని అధిగమించి నాణ్యమైన విద్యుత్ను అందించటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
