టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన నవశకం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. తనను సభకు ఆహ్వానించినపుడు 226రోజులు, 3132 కి.మీ. నడిచినందున యాత్ర ముగింపుసభలో లోకేషే ఉండాలని చెప్పానన్నారు. కానీ నువ్వు ఉండాలని లోకేష్ ఆహ్వానించారని, నాలుగుదశాబ్ధాల సుదీర్ఘ అనుభవజ్ఞుడు చంద్రబాబు కోరడంతో ఇక్కడకు వచ్చానని పవన్ తెలిపారు.
లోకేష్ యువగళం జగన్ లాంటి ఆషామాషీ పాదయత్ర కాదని, మాటల యాత్ర కాదు, చేతల యాత్రని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ కు అభినందనలు తెలిపారు. తాను నడుద్దామంటే నడిచే పరిస్థితిలేదన్నారు. పాదయాత్ర వల్ల చాలామంది కష్టసుఖాలు తెలుసుకోవచ్చని, అలాంటి అవకాశం రానందుకు బాధపడుతున్నా అన్నారు. లోకేష్ దిగ్విజయంగా యాత్ర పూర్తిచేసినందుకు ఆనందంగా ఉందన్నారు.
గతంలో ఐఎఎస్ లు, ఐపిఎస్ లు ఉమ్మడి ఏపీకి రావాలి ఉవ్విళ్లూరేవారని పవన్ తెలిపారు. ఐఎఎస్ అకాడమీల్లో ఏపీ మోడల్ స్టేట్ వెళ్లాలని చెప్పేవారని, ఇప్పుడు ఎందుకు వెళ్లకూడదో జగన్ మోడల్ చూపిస్తున్నారన్నారు. చంద్రబాబును అన్యాయంగా జైలులో పెట్టినపుడు చాలా బాధ కలిగిందన్నారు. కష్టాల చిన్నప్పుడు నుంచి దగ్గరగా చూసిన వాడ్ని, ఓటమి ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తనకు తెలుసన్నారు.
భువనేశ్వరి బాధను అర్థం చేసుకున్నానని, కష్టాల్లో ఉన్నపుడు తన వంతు సాయంగా రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపానని పవన్ వెల్లడించారు. ఎన్ డిఎలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును అరెస్టుచేసి జైలుకు పంపడం తనను బాధించిందన్నారు. జగన్ ను జైలులో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే, జగన్ చంద్రబాబుపై కక్షగట్టారన్నారు.
రాజధాని లేకుండా, సరైన పంపకాలు లేకుండా విభజన జరగడంతో రాష్ట్ర భవిష్యత్తుకోసం ఆనాడు టిడిపి సంకీర్ణానికి మద్దతు ఇచ్చానని పవన్ గుర్తుచేశారు. అప్పట్లో ఒక దశాబ్ధకాలం పాటు అండగా నిలుద్దామని భావించానని, దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాలవల్ల 2019లో ముందుకు తీసుకెళ్లలేకపోయానన్నారు. ఆ లోటు తాలూకు ఫలితమే జగన్ ప్రభుత్వం వచ్చింది. దశాబ్ధ కాలంపాటు సుదీర్ఘ రాజకీయ నేత కావాలని భావించాను, దురదృష్టవశాత్తు మిస్ అయ్యామన్నారు..
2024లో మన ప్రభుత్వం స్థాపిస్తున్నామని, మార్పు తెస్తున్నామని, జగన్ ను ఇంటికి పంపిద్దామని పవన్ పిలుపునిచ్చారు. పాతికమంది ఎమ్మెల్యేలను మార్చారని, మరో 80మందిని మారుస్తారని విన్నానని పవన్ తెలిపారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు… ముఖ్యమంత్రి జగన్ ని అన్నారు. తనకు జగన్ పై వ్యక్తిగత కక్షలేదని, ప్రభుత్వాన్ని సమర్థంగా నడపాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడన్నారు. ఎదురు తిరిగితే కేసులు పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటుందని భావించలేదన్నారు.
తాము ఓ రాజకీయపార్టీగా జగన్ ముఖ్యమంత్రి అయితే శుభాకాంక్షలు చెప్పామని, ఆయనకు మాత్రం ప్రజాస్వామ్య స్పూర్తి తెలియదన్నారు. తాము ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే నీచంగా తిట్టించడం దారుణమని, దశాబ్ధాల రాజకీయ జీవితంలో వైఎస్ కూడా ఆడపడుచులను, ఇంటికి బయటకు రాని వ్యక్తులను విమర్శించలేదని, ఇది ఏం రాజకీయం? అని పవన్ ప్రశ్నించారు. ఇంట్లో ఉన్న తల్లి, చెల్లికి గౌరవం ఇవ్వని వాడు, మన ఇంటిలో ఆడపడుచులకు ఏం గౌరవం ఇస్తాడని అడిగారు. 30వేలమంది ఆడపడుచులు మాయమైతే పట్టించుకోని వాడు మహిళల కష్టాలను ఏం పట్టించుకుంటాడన్నారు.
వైసీపీ వాలంటీర్లు ఆడపడుచుల డాటా సేకరిస్తున్నారని, మాట్లాడాలని పెద్దలు చెప్పినపుడు తాను నమ్మలేదన్నారు. వాస్తవాలు తెలుసుకున్నాక తాను వైసీపీ వాలంటీర్ వ్యవస్థపై గళమెత్తానన్నారు. ఒంటరి మహిళలు, ఆడవాళ్లు, భర్తలేనివారు అన్యాయానికి గురవుతుంటే తెగించి మాట్లాడానన్నారు. వారాహి యాత్ర ప్రారంభమైతే తనపై కువిమర్శలు చేశారని, విశాఖలో ఎయిర్ పోర్టునుంచి పార్టీ కార్యక్రమాలకు వస్తుంటే పోలీసులతో అడ్డగించారన్నారు. ఓ ఉన్నతస్థాయి అధికారి తనతో నీచంగా ప్రవర్తించారన్నారు. ఆ అధికారి స్పీకర్ ఫోన్ నొక్కుకుపోగా సకలశాఖ మంత్రి నన్ను అడ్డగించాలని డైరక్షన్ ఇచ్చారన్నారు.
సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబులాంటి వారికే ఇలాంటి పరిస్థితి వస్తే, భవిష్యత్తులో సామాన్యుడి పరిస్థితి ఏమిటి? రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఎలా వస్తాయని పవన్ ప్రశ్నించారు. ఇప్పటం సభలో వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాను. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి పెట్టుబడుల రావాలని భావించి తాను ఆ మాటలు అన్నానన్నారు. ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశించే క్షణాలన్నారు.
బీజేపీని మోసం చేశానని తనను వైసీపీ నేతలు విమర్శించారని, అయితే ఏపీ పరిస్థితులను బీజేపీ జాతీయ నాయకత్వానికి వివరించానన్నారు. టీడీపీ -జనసేన పొత్తుకు మీ మద్దతు కావాలని అమిత్ షాకు తెలియజేశాను. వారు ఎంతవరకు ఒప్పుకుంటారో తెలియాదు. రాబోయే ఎన్నికల పొత్తు కీలకమైందని, పొత్తుపెట్టకోకపోతే భవిష్యత్తులో కర్రలు, కత్తులతో రోడ్లపైకి వచ్చి కొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. తనతో సహా అందరం ఆయుధాలతో రోడ్లపైకి రావాల్సి వస్తుందని బీజేపీ కేంద్రనాయకత్వానికి చెప్పానన్నారు.
జనసేన ఆలోచన విధానంపై లోకేష్ తో మాట్లాడానని, భవిష్యత్తులో ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తామన్నారు. తాను చంద్రబాబు కలిసి రానున్నరోజుల్లో భారీసభ ఏర్పాటుచేసి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఈ మైత్రి, స్పూర్తిని చాలాసంవత్సరాలు కొనసాగాలని ఆశిస్తున్నానన్నారు. హలో ఎపి… వైసిపి బైబై, టిడిపి-జనసేన మైత్రి వర్థిల్లాలని కోరారు. టీడీపీ-జనసేన మైత్రికి బీజేపీ అధినాయకత్వం మద్దతునిస్తుందని ఆశిస్తున్నట్లు పవన్ తెలిపారు.
