నా వీడియో కూడా: ‘డీప్‌ఫేక్’ ఆందోళనకరమన్న ప్రధాని మోడీ, కీలక సూచనలు..

ఇటీవల దేశంలో డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీనటులు రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ ముఖాలను ఇతర మహిళలకు అతికించి వీడియోలను వైరల్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్పందిస్తూ.. డీప్‌ఫేక్ (Deepfake) ఫొటోలు, వీడియోలు ఆందోళనకరంగా మారాయన్నారు.

 

Advertisement

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగని ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి ఇలా డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం సమస్యాత్మకం, పెను ఆందోళకరమని వ్యాఖ్యానించారు. డీప్‌ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెనుముప్పుగా మారుతున్నాయని.. ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయన్నారు.

 

 

ఇటీవల నేను పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. తెలిసినవాళ్లు కొందరు దాన్ని నాకు ఫార్వర్డ్ చేశారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు.. ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి. వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలన్న దానిపై అవగాహన కల్పించాలని ప్రధాని మోడీ కోరారు.

 

ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పుడు వాటిని ఫ్లాగ్ చేసి, వార్నింగ్ ఇవ్వాలని చాట్ జీపీటీ (ChatGPT) బృందాన్ని తాను కోరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కాగా, ఇటీవల నటి రష్మిక మందన్నా, ఆ తర్వాత కత్రినా కైఫ్, కాజోల్ లకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ తదితర సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేిసంది. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ఫిర్యాదు అందిన 36 గంటల్లోపు వాటిని తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను కేంద్రం ఆదేశించింది. నిబంధనలు పాటించని సంస్థలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. నిందితులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది

Editor