ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలు, అక్రమాలను రోజుకొకటి చొప్పున బయటపెడతామని వారం రోజుల క్రితం ప్రకటించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు. విద్యా శాఖలో ఓ స్కామ్ కు సంబంధించిన వివరాలను ఆయన ఇవాళ బయటపెట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్లు దారి మళ్ళినట్లు నాదెండ్ల ఇవాళ ఆరోపించారు.
Advertisement
ఇటీవల ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 5 కంపెనీలపై దాడులు చేసిందని, ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్ర ప్రదేశ్ లో డొంక కదిలిందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుంచి వయా తాడేపల్లి మీదుగా రాయలసీమకు ఇవి చేరాయా? అని ఆయన ప్రశ్నించారు. నిధులు ఎలా దారి మళ్ళాయి అనేదానిపై ఈడీ సమగ్ర విచారణ మొదలుపెట్టిందన్నారు.ఈ స్కాంలో 5 కంపెనీలు సిండికేట్ గా మారాయి అనేది అర్థం అవుతోందన్నారు.
జగనన్న విద్యా కానుకలో భాగంగా ప్రభుత్వం నాసిరకం బూట్లు, చిరిగిపోతున్న బ్యాగులు ఇస్తోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలు లాలూచీపడ్డారని, ఇప్పటి వరకూ జగనన్న విద్యా కానుక పేరుతో రూ.2400 కోట్లు నిధులు వెచ్చించారన్నారు. ఈ 5 కంపెనీలు వెనక ఎవరు ఉన్నారు? పేద విద్యార్థుల పేరుతో కోట్లు దోచేస్తున్నారని నాదెండ్ల నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది 35 లక్షల మంది విద్యార్థులని, అయితే జగనన్న విద్యా కానుకకు పర్చేజ్ ఆర్డర్ పెట్టింది 42 లక్షలన్నారు. ఈ వ్యత్యాసంలో ఉన్న మొత్తం ఎటు పోతుందని అడిగారు.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం పెద్ద మాటలు చెబుతూ క్వాలిటీ వాల్ అని విద్యార్థులను మభ్యపెడుతున్నారని నాదెండ్ల ఆరోపించారు. గోడ మీద చూపించే వాటికీ విద్యార్థులకు ఇచ్చే బూట్లు, బ్యాగులకు సంబంధం లేదన్నారు. ఎడమ కాలుకి 3వ నెంబర్ సైజ్, కుడి కాలుకి 5వ నెంబర్ సైజ్ షూస్ ఇస్తున్నారన్నారు. క్లాస్ వార్ అని చెప్పే జగన్ పేద విద్యార్థుల పేరుతో కోట్లు మళ్లిస్తున్నారని, పేద విద్యార్థులను, వారి తల్లితండ్రులను మోసం చేస్తున్నారన్నారు.
