తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం – బిగ్ టర్న్..!!

తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా తీసుకుంది. కాంగ్రెస్ టాప్ లీడర్లు తెలంగాణలో మొహరిస్తున్నారు. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావటానికి అన్ని సమీకరణాలకు కలిసి వస్తున్నాయని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. దీంతో, చివరి నిమిషంలో అధికార బీఆర్ఎస్ కు ఏ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు స్వయంగా రంగంలోకి దిగుతోంది. 1994 తరువాత తొలి సారి కాంగ్రెస్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. ఒక్క సీటును మాత్రం సీపీఐకి కేటాయించింది. సీట్ల కేటాయింపులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పార్టీ అధినాయకత్వం గెలుపు సొంతం చేసుకోవాలని గట్టి నిర్ణయం తో ఉంది. అందులో భాగంగా ఈ నెల 17 నుంచి జాతీయ స్థాయు నాయకులు మరియు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సైతం ప్రచారం చేయించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది..

 

అగ్రనేతల రాక : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ఏఐసిసి అగ్రనేతలు ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. అదే రోజున పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో రాహుల్ సభలు ఉంటాయి. ఈ రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనలు సైతం ఖరారు అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈనెల 20వ తేదీ తరువాత వారం రోజుల పాటు ఢిల్లీ నుంచి అగ్రనేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఆరు రోజులు తెలంగాణలోనే రాహుల్ మకాం వేసేలా నిర్ణయించారు. 17 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల విస్తృత పర్యటన ఉండనుంది. ఒకే రోజు తెలంగాణలో రాహుల్, ప్రియాంక, ఖర్గే సమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వీఐపీ పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీ నుంచి ఒక ముఖ్య నేత ప్రచారం చేసేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.

 

 

టార్గెట్ కేసీఆర్ : ఈ నెల 28వ తేదీన ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ లోగా పార్టీ ముఖ్య నేతలు సాధ్యమైనన్ని ప్రచార సభల్లో పాల్గొనేలా నియోజకవర్గాలను ఎంపిక చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకి రెండు హెలికాప్టర్లను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి రోజుకు మూడు సభల చొప్పున హాజరవుతున్నారు. ఢిల్లీ నుంచి ఏఐసీసీ ప్రతినిధుల టీం తెలంగాణలో ఎన్నికల ప్రచారం..ప్రత్యర్ధి పార్టీల తీరు తెన్నులను ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఢిల్లీకి నివేదికలు ఇస్తోంది. ఇక, హైదరాబాద్ లేదా వరంగల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సోనియాను ఆహ్వానించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీ పథకాలతో పాటుగా కొత్తగా విడుదల చేసే మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లటం..కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ను గెలిపించుకొనేలా అగ్ర నేతల ప్రచారం కొనసాగనుంది. దీంతో, వీరి ఎంట్రీతో ప్రచారం నెక్స్ట్ లెవల్ కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Editor