Latest Posts

ఏపీలో దసరాకు ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆర్టీసీ ఇవాళ రెండు శుభవార్తలు

ఏపీలో దసరాకు ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆర్టీసీ ఇవాళ రెండు శుభవార్తలు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా రద్దీని ఎదుర్కొనేందుకు ఎప్పటిలాగే అదనపు బస్సులు ప్రకటించిన ఆర్టీసీ..

ఇందులో రెండు ఆఫర్లను అందిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను కోరుతోంది. అసలే కరోనా తర్వాత ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆర్టీసీ.. ఎలాంటి భారం లేకుండానే ఈ అదనపు బస్సుల్ని నడపబోతుండటం విశేషం.

ఏపీలో దసరా సీజన్ దృష్ట్టా ఈసారి వివిధ ప్రాంతాల నుంచి 5500 స్పెషల్ బస్సుల్ని నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ స్పెషల్ బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించింది. ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించింది. దీంతో ఈ ప్రత్యేక బస్సుల్లో రెగ్యులర్ బస్సుల తరహాలోనే ఛార్జీలు వసూలు చేయబోతున్నారు. దసరా సందర్భంగా ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకూ ఈ స్పెషల్ బస్సుల్ని నడుపుతున్నారు.

ఏయే ప్రాంతాల నుంచి ఈ 5500 బస్సులు నడుస్తాయన్న దానిపై స్ధానికంగా ఉండే బస్సు స్టేషన్లతో పాటు ఆన్ లైన్లోనూ సమాచారం అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికుల కోసం 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. విజయవాడ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అలాగే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు కూడా ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తోంది.

రాష్ట్రంలో దసరా సందర్భంగా నడిపే 5500 స్పెషల్ బస్సుల్లో 2700 బస్సుల్ని దసరా పండుగకు ముందే అంటే 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ నడపనుంది. అలాగే మరో 2800 బస్సుల్ని పండగ ముగిశాక కూడా అంటే అక్టోబర్ 23 నుంచి 26 వరకూ నడపబోతోంది. ఇందులో హైదరాబాద్ నుంచి 2050 బస్సులు, బెంగళూరు నుంచి 440 బస్సులు, చెన్నై నుంచి 153 బస్సులు, విశాఖ నుంచి 480 సర్వీసులు, రాజమండ్రి నుంచి 355 బస్సులు నడుపుతోంది. విజయవాడ నుంచి ఏకంగా 885 బస్సులు వివిధ ప్రాంతాలకు అందుబాటులో ఉంచుతోంది.

 

Posted Under AP
YES9 TV