తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఐదుగురు కథానాయకులపై అక్కడి నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీచేసినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో తలెత్తే రాజకీయ, సామాజిక సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇతర సంస్థలతో కలిసి పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది.
తమిళ పరిశ్రమకు చెదిన విశాల్, శింబు, ఎస్ జే సూర్య, యోగిబాబు, అథర్వలకు రెడ్ కార్డు జారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కథానాయకులు నిర్మాతలకు సహకరించని కారణంగా వారికి రెడ్ కార్డు జారీచేసినట్లు తెలుస్తోంది. వీరంతా కొత్త ప్రాజెక్ట్ కోసం నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకొని తర్వాత వారికి డేట్లు కేటాయించలేదు. నిర్మాతలు ఎంతగా అడుగుతున్నప్పటికీ షూటింగ్ కోసం తేదీలు ఖరారు చేయడానికి నిరాకరించారు. అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలంతా మండలికి ఫిర్యాదు చేశారు.
దీన్ని తీవ్రమైన తప్పుగా భావించిన నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రెడ్ కార్డ్ జారీచేశారా? అనే విషయంలో అధికారికంగా సమాచారం లేదు. మండలి నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఎవరూ ఈ వార్తను ధ్రువీకరించలేకపోతున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి రెడ్ కార్డ్ పొందడం శింబుకు ఇది మొదటిసారి కాదు.
కొన్ని సంవత్సరాలుగా నిర్మాతలతో అతను వివాదాల్లోనే ఉన్నాడు. అయితే మానాడు, వెందు తానింధతు చిత్రాలు భారీ హిట్ అవడంతో కంబ్యాక్ అయ్యాడు. తన తదుపరి చిత్రం STR 48 కోసం ఆయన సైన్ చేశారు. దేశింగ్ పెరియసామి దీన్ని తెరకెక్కించబోతున్నారు. అలాగే విశాల్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రల్లో అధిక్ రవిచందర్ దర్శకత్వంలో మార్క్ ఆంటోని తెరకెక్కింది. ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు ముస్తాబవుతోంది.
