డబుల్ ఇంజన్ సర్కారుకు అర్థం చెప్పిన రేవంత్ రెడ్డి

ప్రజల కోసం, పార్టీ కోసం పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు.

2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ ను స్వీకరించినట్లు తెలిపారు.

భారతీయ జనతాపార్టీ కుట్రలను తిప్పికొట్టి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులకు రేవంత్ పిలుపునిచ్చారు. 1200 మంది ప్రాణత్యాగంతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. బీజేపీ చెప్పే డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధానమంత్రి అని, దేశాన్ని దోచుకోవడమే డబుల్ ఇంజన్ పని అని మండిపడ్డారు. సెప్టెంబరు 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేద్దామన్నారు.

తెలంగాణలో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, డిసెంబరు 9వ తేదీన సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును కానుకగా ఇద్దామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణమైన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ని చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ పై యువజన కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.

YES9 TV