మంచితనం, మానవత్వం, చేసేపనిపట్ల అంకితభావం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం అన్నింటికి మించి మితభాషి ఆ పెద్దాయన. మరి అన్ని సులక్షణాలున్న పెద్దాయనకే కోపం వస్తే, జరుగుతున్న సంఘటనలు చూసి చిర్రెత్తుకొస్తే, దానికి తోడు చమత్కరిస్తూనే హద్దు మీరి ప్రవర్తిస్తున్నవారికి మాస్ వార్నింగ్ ఇస్తే అది పెద్ద చర్చనీయాంశమే అవుతుంది.
ప్రస్తుతం ఆ పెద్దాయన మాటలు ఓ వర్గం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి అంట.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పార్టీలకు అతీతంగా, దేశవ్యాప్తంగా గౌరవాన్ని సంపాదించుకున్న నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, భారత మాజి ఉపరాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఎప్పుడూ ఆయన తొడరపడి మాట్లాడరు. అంత కూల్ గా కనిపించే వెంకయ్య నాయుడే మృదువుగా మాట్లాడుతూనే చురకలు అంటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒక్కరోజు క్రితం గుంటూరులో కోడెల విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అథిగా విచ్చేసిన వెంకయ్య సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో అటెన్షన్ తగ్గిపోయి టెన్షన్ వాతావరణం పెరిగిపోతుందని, ఇది రాష్ట్ర ప్రగతికి ఏమాత్రం మంచిదికాదని వెంకయ్య అన్నారు. ఆయా పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవ్వరైనా ప్రత్యర్ధులు మాత్రమే కానీ శత్రువులు కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
ప్రస్తుతం రాజకీయాలు అంటే ఒకరినొకరు అగౌరవపరచుకోవడం, కుటుంబసభ్యులను తిట్టడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వంటివి చేస్తున్నారని, ఇవి ఆరోగ్యకరమైన రాజకీయాలు కావని వెంకయ్య విచారం వ్యక్తం చేశారు. బూతులతో నోరు పారేసుకుంటున్న నాయకులకు పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలని వెంకయ్య సూచించారు.
గతంలో పార్టీలు సభలు నిర్వహిస్తే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేవారని, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయని, డబ్బులిచ్చి ప్రజలను సభలకు తరలించాల్సి వస్తుందని ఆయన వాపోయారు. గతంలో సభలకు వచ్చిన జనం అర్ధరాత్రి అయినా ఓపికతో ప్రసంగాలు వినేవారని, కానీ ఇప్పుడు బారికేడ్లు పెట్టి జనాలను నిలువరించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు దాపరించాయని వెంకయ్య అన్నారు. నిజాయితో కూడిన రాజకీయాలు చేయడానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తాను పదవీ విరమణ చేశానాని, కానీ పెదవి విరమణ చేయలేదన్న వెంకయ్య వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపాయి.
వెంకయ్య చేసిన వ్యాఖ్యలన్ని వైసీపీ పార్టీ వైఖరి మరియు ఆ పార్టీలోని కొంతమంది నాయకులను ఉద్దేశించి చేసినవేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సభలకు జనాలను తరలించడం, బారికేడ్లు పెట్టి సభకు వచ్చినవారిని నిలువరించడం చేసినట్లు ఇటీవల న్యూస్ ఛానళ్ళలో కూడా బాగా ప్రసారం అయ్యాయి. అంతే కాకుండా రాజకీయాల్లో బూతులు, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వంటి వ్యాఖ్యలు కొడాలి నాని, వల్లభనేని వంశీ లను ఉద్దేశించి వెంకయ్య చేసి ఉండొచ్చు అనేది విశ్లేషకుల మాట.
