తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నమొన్నటిదాకా కేసీఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ప్రతిపక్షాలు ఇప్పుడు నోరుమెదపడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నాయి.
ప్రతిపక్షాలు కాబట్టి, వారి ఉనికి కోసం ఏదో విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నారే కానీ, వాస్తవానికి విమర్శలు చేసేంత అవకాశం కేసీఆర్ ఏమాత్రం ఇవ్వడంలేదని తెలంగాణ ప్రజానీకం కోడై కూస్తుంది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సమయం దగ్గర పడుతుండటంతో కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈసారి విద్యావంతులకి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారట. విద్యావంతులతో పాటు పార్టీకి వీర విధేయులుగా ఉన్నవారిలో ఎవరికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో కేసీఆర్ నిమగ్నమయ్యారని బిఆర్ఎస్ శ్రేణుల నుండి వినిపిస్తున్న మాట. కేసీఆర్ డిల్లీ టూర్ అనంతరం అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
కేసీఆర్ పరిశీలిస్తున్న పేర్లలో పి.ఎల్ శ్రీనివాస్, టి.ఎస్.పి.ఎస్.సి మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరి కొంతమంది పేర్లు కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారట. ఇక బీసీ కోటా నుండి ఎంపిక చేయాల్సి వస్తే బూడిద భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేతలకు కూడా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకోసం చిరుమల రాకేష్, డి రాజారాం, తుంగ బాలు పేర్లను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. వీరిలో ఒకరి పేరును కేటీఆర్ గట్టిగా సిఫార్సు చేస్తున్నారని తెలుస్తుంది.
ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు, ఎన్టీఆర్ కేబినెట్ లో సైతం మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారట. మోత్కుపల్లికి ఉన్న అనుభవంతో పాటు ప్రజలకు సేవచేసే విధానం, వివాదాలకు దూరంగా ఉంటారనే అంశాలతో పాటు పార్టీకి కూడా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే మోత్కుపల్లి పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ గవర్నర్ కి సిఫార్సు చేయబోతున్నట్లు తెలుస్తుంది.
