ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన అంశాలను ఆచరణలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుంది. ఇదే సమయంలో విద్యార్ధులకు ఇచ్చిన హామీ నేటి నుంచి అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల హామీ మేరకు
ఏపీ నుంచి కొత్త సంవత్సరం వేళ కీలక హామీ అమలు మొదలు పెట్టింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పున:ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ తాజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014-19 టిడిపి హయాంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించింది. 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమ్మఒడి అమలు కారణంగా ఇంటర్ విద్యార్ధులకు ఈ పథకం నిలుపుదల చేసింది.
నేటి నుంచి అమలు
ఇక, 2024 ఎన్నికల ప్రచారం వేళ తాము అధికారంలోకి వస్తే ఇంటర్ విద్యార్ధులకు మధ్నాహ్న భోజన పథకం అమలు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా నేటి నుంచి ఈ పథకం అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024-25 సంవత్సరానికి రూ.27.39 కోట్లు, 2025-26 ఏడాదికి రూ.85.84 కోట్ల ఖర్చే అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త సంవత్సరం సందర్భంగా నేటి (బుధవారం) నుంచి ఈ కార్యక్రమం అమలు చేయాలని డిసైడ్ అయింది.
మెనూ లో మార్పులు
ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మధ్నాహ్న భోజన పథకం పేరు మార్పు చేసింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గా ఖరారు చేసింది. అదే విధంగా విద్యార్ధులకు అందించే మెనూలోనూ కొత్త విధానం తీసుకొచ్చింది. జోన్ల వారీగా మెనూ అమలుకు వీలుగా నిర్ణయాలు తీసుకుంది. ఏ జోన్ లో ఏ మెనూ అమలు చేయాలో అధికారులు నిర్దేశించారు. దీని ద్వారా నాణ్యణ తో కూడిన భోజనం అందించాలని స్పష్టం చేసింది. ఇక, ఇప్పుడు ఇంటర్ విద్యార్ధులకు అందించే మధ్నాహ్న భోజన మోనూ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నేటి నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.
