ప్రధానిగా వరుసగా మూడో సారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కొలువు తీరుతోంది. గత అయిదేళ్ల కాలంలో ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఈ సారి కూటమి ఎన్డీఏ కూటమి కేంద్రంలో, రాష్ట్రంలో విజయం సాధించటంతో రెండు ప్రభుత్వాల్లోనూ మూడు పార్టీలు భాగస్వాములు కానున్నాయి. ఇక..ఏపీ నుంచి కేంద్రంలో మంత్రులు కాబోయే ముగ్గురికి ప్రధాని కార్యాలయానికి రావాలని ఆహ్వానం అందింది.
కేంద్ర మంత్రివర్గంలో ఈ సారి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీఏలో సంఖ్య పరంగా రెండో స్థానంలో ఉంది. దీంతో..కేంద్ర కేబినెట్ లో నాలుగు మంత్రి పదవులు టీడీపీకి దక్కుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ రోజు ఏర్పాటు కానున్న కేబినెట్ తొలి విడతగా చెబుతున్న బీజేపీ ముఖ్యులు..త్వరలోనే విస్తరణ ఉంటుందని..అందులో మరిన్ని పదవులు ఏపీకి దక్కుతాయని వెల్లడించారు. ఈ రోజు మోదీ తొలి కేబినెట్ లో ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు ఇద్దరు..ఒక బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ నుంచి ఇద్దరు టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు మంత్రి పదవులు ఖాయమయ్యాయి. ఈ ఇద్దరికి ప్రధాని కార్యాలయానికి రావాలని ఫోన్లు వచ్చాయి. కాసేపట్లో ప్రధాని నివాసంలో జరిగే తేనేటి విందుకు ఈ ఇద్దరు హాజరు కానున్నారు. మూడో సారి గెలిచిన రామ్మోహన్ నాయుడుకు సామాజిక న్యాయ శాఖను కేటాయిస్తారని సమాచారం. పెమ్మసానికి ఐటీ లేదా వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి దక్కుతుందని చెబుతున్నారు. బీజేపీ నుంచి పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా ఢిల్లీ బీజేపీ వర్గాల్లో మాత్రం సీఎం రమేష్ పేరు ప్రచారంలో ఉంది. ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది.
మూడు మంత్రి పదవులు పురందేశ్వరికి మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల్లో అయిదు కంటే ఎక్కువ మంది ఎంపీల బలం ఉన్న పార్టీలకు ఒక కేంద్ర కేబినెట్, మరో సహాయ మంత్రి పదవి ఇస్తున్నారు. అయిదు కంటే తక్కువ ఉన్న పార్టీలకు ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. రైల్వే, వ్యవసాయ శాఖలను జేడీ(యూ)కు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. జనసేన నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. అయితే, కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో..ఏపీలో కొత్త ప్రభుత్వానికి కేంద్రం నుంచి అందే సహకారంలో ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న వారి పాత్ర కీలకంగా మారనుంది.
