ఐఏఎస్, ఐపీఎస్ లకు చంద్రబాబు ఝలక్..!

ఏపీలో టీడీపీ సునామీ సృష్టించిన వెంటనే.. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం అధికారుల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. జగన్ ప్రభుత్వంలో గీత దాటిన అధికారుల విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సైతం షాక్‌ ఇచ్చారు. సెలవుపై వెళ్లాలంటూ ఆయనకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబును కలవడానికి నిన్న వెళ్లారు సీఎస్ జవహర్‌రెడ్డి. ఆయన్ను కలిసేందుకు ఇష్టపడని చంద్రబాబు.. రెండున్నర గంటలు వెయిట్ చేయించి.. 2 నిమిషాల్లో పంపించేశారు.

 

మరో సీనియర్ అధికారి, ఇంటెలిజెన్స్‌ మాజీచీఫ్ PSR ఆంజనేయులినీ వెనక్కి పంపించేశారు. చంద్రబాబుని కలవడానికి వెళ్లారు ఆంజనేయులు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ లేదని చెప్పడంతో ఆయన వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. సీనియర్లకే షాక్‌లు ఇస్తుండడంతో.. జగన్ హయాంలో గీత దాటిన ఐఏఎస్‌, IPS అధికారుల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు.

 

వైసీపీ కోసం పనిచేసిన అధికారుల విషయంలో ఎలా వ్యవహరించాలో చంద్రబాబు స్పష్టతతో ఉన్నట్టు చెప్తున్నారు. రెడ్‌బుక్‌లో నమోదైన అధికారుల విషయంలో.. కఠినంగా ఉంటామని లోకేశ్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. మరోవైపు.. సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డిని అన్ని శాఖల నుంచి తొలగించారు. దీంతో అపాయింట్‌మెంట్ కోసం కొల్లి రఘురామిరెడ్డి ప్రయత్నాలు చేశారు కానీ.. చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.

 

మరోవైపు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని రుచిచూసిన వైసీపీ నేతలంతా.. పార్టీ ఓటమికి గల కారణాలపై విశ్లేషణలు, చర్చలు చేస్తున్నారు. వైసీపీ ఓటమికి కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ అని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. మరికొందరైతే వాలంటీర్లవల్ల, అధికారుల తీరుతో ఓడిపోయామని చెబుతుండగా.. అధికారంలో ఉన్న మంత్రుల నోటి దురుసు కూడా ఓటమికి కారణంగా పేర్కొంటున్నారు. జగన్ అధ్యక్షతన పార్టీ క్యాంప్ ఆఫీస్ లో పార్టీ ఓటమికి గల కారణాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

 

Posted Under AP
Editor