బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం.. గురువారం ఉదయం 11 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. దీంతో గడువులోగా కేసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంది.
కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలాపై ఈసీ నిషేధం
బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలాపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఏప్రిల్ 16న సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఈ లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ఈసీ విధించిన మొదటి ప్రచార నిషేధం ఇదే కావడం గమనార్హం.
హేమమాలినిపై అమర్యాదకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సుర్జేవాలాకు ఎన్నికల సంఘం గత మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇందుకు బదులిస్తూ సూర్జేవాలా సమర్పించిన ప్రత్యుత్తరాన్ని నిశితంగా పరిశీలించిన ఈసీ.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
‘హేమమాలినిపై సూర్జేవాలా అత్యంత అసభ్యకర, అనాగరిక వ్యాఖ్యలు చేశారు. అలాంటి మాటలు ఎన్నికల కోడ్కు వ్యతిరేకం’ అని ఈసీ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం సూర్జేవాలా 48గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిషేధం అమల్లో ఉండే కాల వ్యవధిలో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, మీడియా వేదికల్లో సూర్జేవాలా ప్రసంగాలు చేయకూడదని ఈసీ తేల్చి చెప్పింది.
సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది: ఈసీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటున్న 40 మందికి కోడ్ వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలుంటాయని స్పష్టం చేసింది.
