Latest Posts

కేసీఆర్‌‌‌పై చేతబడి…?ఇంటి వద్ద క్షుద్రపూజలు..

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.

 

ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి.. అన్ని కోణాల నుంచీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కష్ట నష్టాలను ఎదుర్కొంటోంది. ఆటుపోట్ల బారిన పడింది. అటు వలసలు, ఇటు అరెస్టులు ఆ పార్టీని చుట్టుముట్టాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కేసీఆర్‌, ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరుతున్నారు.

 

కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తులుగా పేరున్న బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు పార్టీకి దూరంగా ఉంటోన్నారు. ఆయన కూతురు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కేశవరావు కూడా కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది.

 

బీఆర్ఎస్‌కే చెందిన మరో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం, కూతురు కడియం కావ్యతో సహా కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ లోక్‌సభ టికెట్‌ను కేటాయించిన తరువాత కూడా ఆమె దాన్ని వదులుకుని మరీ పార్టీని వీడారు. అదే వరంగల్ లోక్‌సభలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు.

 

అటు చూస్తే- కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారామె. ప్రస్తుతం దేశ రాజధానిలోని తీహార్ జైలులో ఉంటూ ఈడీ, సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. బెయిల్ కూడా లభించట్లేదు.

 

మరోవంక- ఎన్నికలు ముగిసి తొలి రోజుల్లోనే కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. బాత్‌రూమ్‌లో జారిపడటం వల్ల ఆయన తుంటి ఎముక విరిగింది. దీనికి సర్జరీ చేయించుకున్నారు. మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందాయనకు. ఇప్పటికీ చేతికర్ర సహాయంతోనే నడుస్తోన్నారాయన.

 

ఈ పరిస్థితులన్నింటికీ కారణం- కేసీఆర్ కుటుంబంపై క్షుద్ర ప్రయోగాలేనని చెబుతున్నారు. చేతబడి జరగడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఒక్కసారిగా ఇన్ని ఇబ్బందులు చుట్టుముట్టడానికి ప్రధాన కారణం అని అంటోన్నారు. తాజాగా హైదరాబాద్ నందినగర్‌లో గల కేసీఆర్ ఇంటి పక్కన గల ఖాళీ స్థలంలో క్షుద్రపూజలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు.

 

కేసీఆర్ ఇంటి ప్రహరీగోడకు ఆనుకుని ఉండే ఖాళీ స్థలంలో క్షుద్రపూజలు చేసినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. క్షుద్రపూజలు చేశారనడానికి గుర్తుగా అక్కడ నిమ్మకాయలు, ఓ బొమ్మ, మిరపకాయలు, పాలిథిన్ కవర్‌లో పెట్టిన నల్లకోడి ఈకలు, కోడిగుడ్డు, కుంకుమ ఉన్నాయి. స్థానికులు ఈ విషయాన్ని కేసీఆర్ ఇంటి సెక్యూరిటీ దృష్టికి తీసుకెళ్లడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

Editor