ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ యాత్రను పూర్తిచేశారు. బస్సు యాత్ర సందర్భంగా అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి. దీనిపై దృష్టిసారించిన ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది.
బస్సు యాత్రలో భాగంగా విజయవాడ వద్ద జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసిన జెండాలు, ఫ్లెక్సీలను ఈసీ తొలగించింది. ఎమ్సీసీ పర్యవేక్షక బృందం తాడేపల్లి, విజయవాడ మధ్య కృష్ణా వారధిపై ఏర్పాటు చేసిన జెండాలను తొలగించారు. వారధికి రెండు వైపులా వీటిని ఏర్పాటు చేయగా, తాడేపల్లి మున్సిపల్ సిబ్బంది వీటిని తొలగించారు. ఈరోజే ఎన్టీఆర్ జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది.
గతనెలలో బస్సు యాత్రను జగన్ ప్రారంభించారు. నాలుగు లోక్ సభ నియోజకవర్గాలు మినహా అన్ని స్థానాల పరిధిలో యాత్ర కొనసాగనుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలై శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. 14వ రోజు గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. నంబూరు నుంచి మంగళగిరి నియోజకవర్గం మీదగా విజయవాడలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. మంగళగిరి నియోజకవర్గ నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.
ఈనెల 18వ తేదీ నుంచి ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అదేరోజు నామినేషన్ వేయనున్నారు. వైఎస్ జగన్ పులివెందుల నుంచి ఈనెల 25వ తేదీన నామినేషన్ వేయనున్నారు. పులివెందులలో టీడీపీ తరఫున బీటెక్ రవి పోటీచేస్తున్నారు.
