ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలంతా ఓ ఎత్తు, పిఠాపురంలో జరుగుతున్న పవన్ కళ్యాణ్, వంగా గీత పోరు మరో ఎత్తుగా మారుతోంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో గెలవనీయకుండా వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా స్దానిక రైతుల్ని కూడా టార్గెట్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. ఈ మేరకు డీసీసీబీ అధికారులు రైతుల్ని ఒత్తిడి చేస్తున్నారని ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు.
పిఠాపురంలో డీసీసీబీ నుంచి రుణాలు తీసుకున్న రైతుల్ని వైసీపీకి ఓటేస్తారా లేక తీసుకున్న రుణాల్ని వెంటనే చెల్లిస్తారా అంటూ రికవరీ టాస్క్ ఫోర్స్ అధికారులు బెదిరిస్తున్నారని వర్మ షాకింగ్ ఆరోపణలు చేశారు. వైసీపీకి మద్దతు ఇస్తే మాత్రం వారి రుణ బకాయిలు అడగమని అధికారులు చెప్తున్నారన్నారు. పిఠాపురంంలో టీడీపీ, జనసేనకు చెందిన రైతులను మాత్రమే ఇలా బ్యాంక్ అధికారులు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
పిఠాపురంలో బ్యాంకు అధికారులు తీరు మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని టీడీపీ నేత వర్మ హెచ్చరించారు. బ్యాంక్ అధికారుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికార పార్టీకి వంతపాడుతున్న నేత్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమికి వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని వర్మ హెచ్చరించారు.
