లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరీ ప్రచారం సాగుతోంది.
ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కొత్త సంకటాన్ని ఎదుర్కొంటోంది. లోక్సభ కంటే ముందు శాసన మండలి ఉప ఎన్నికను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ నెల 28వ తేదీన ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం ఆ పార్టీ సన్నద్ధమౌతోంది. కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి అవసరమైన ఉప ఎన్నిక ఇది.
ఈ నెల 4వ తేదీ నాడే నామినేషన్ల స్వీకరణ ఆరంభమైన విషయం తెలిసిందే. 11 వరకు నామినేషన్లు స్వీకరించారు ఎన్నికల అధికారులు. 12వ తేదీన నామినేషన్ల పరిశీలన ముగిసింది. 14వ తేదీ వరకు ఉపసంహరణ గడువు కొనసాగింది. 28వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఏప్రిల్ 2వ తేదీన విజేతను ప్రకటిస్తారు అధికారులు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున మన్నె జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు. రెండు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ తరహాలోనే ఈ బైపోల్లో కూడా విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. దీన్ని నిలుపుకోవడానికి బీఆర్ఎస్ సర్వశక్తులనూ ఒడ్డుతోంది.
ఈ క్రమంలో- క్యాంప్ రాజకీయాలకు తెర తీసింది బీఆర్ఎస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులను గోవాకు తరలించింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, జిల్లాకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తోన్నారు.
