తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పర్వం ఉత్కంఠ పెంచుతుంది. సీఎం రేవంత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బిజెపి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ కు ఎన్నికలు సవాల్ గా మారుతున్నాయి. కెసిఆర్ ఇప్పుడు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మూడు పార్టీల పోరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్ తమ జాబితాలను విడుదల చేశాయి. కెసిఆర్ తమ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ టిక్కెట్ నో ప్రకటించినా, మెదక్ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు. తొలుత మెదక్ నుంచి ఒంటేరు ప్రతాపరెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత వచ్చిన తర్వాతనే తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మరి కొంతమంది నేతలు గులాబీ పార్టీ నుంచి సీటు ఆశిస్తూ రేసులోకి వచ్చారు.
మెదక్ బరిలో అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపూర్ టికెట్ ను సునీత రెడ్డి కు ఇవ్వటంతో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ సీటు ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన గాలి అనిల్ కుమార్ కు ఇదే రకమైన హామీ దక్కింది. వీరితో పాటుగా ఆ బీరయ్య యాదవ్, శశిధర్ రెడ్డి తమ అభ్యర్థిత్వలను పరిశీలించాలని కోరుతున్నారు. మెదక్ నుంచి బిజెపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరు ప్రకటించారు. ఆయన ప్రచారం ప్రారంభించారు.
కేసీఆర్ బరిలో నిలుస్తారా ఇదే సమయంలో మెదక్ పార్లమెంటుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తానే బరిలోకి దిగితే పార్టీలో ఎన్నికలవేళ జోష్ పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరనేది ఖరారు అయిన తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. మూడు పార్టీలకు హోరాహోరీగా మారిన ఈ పార్లమెంట్ ఎన్నికల సమరంలో కేసీఆర్ బరిలో నిలుస్తారా లేక మెదక్ సీటు మరొకరికి కేటాయిస్తారా అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.
