Latest Posts

డబుల్‌ ఓటర్లకు కొత్త చిక్కు.. షాక్‌ ఇచ్చిన ఈసీ..!

డబుల్‌ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ఓటు వేయాలని భావించారు ఆంధ్రాసెటిలర్లు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరు తెలంగాణలో ఓటు వేశారు. 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటుహక్కు వినియోగించుకోవడంతోపాటు తెలంగాణలోనూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలనుకున్నారు. కానీ ఈసీ తీసుకున్న నిర్ణయం వీరికి ఆ ఛాన్స్‌ లేకుండా పోయింది. ఏపీ అధికార పార్టీ ఫిర్యాదుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకేరోజు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొంది. ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ ఇచ్చి మే 13న ఎన్నికలు నిర్వహించనుంది.

 

ఒక్కచోట మాత్రమే..

ఎన్నికల సంఘం నిర్ణయం ఏపీలోని టీడీపీ, జనసే, బీజేపీ కూటమికి కొంత ఇబ్బందికరమనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికీ తెలంగాణలోనే నివాసం ఉంటున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌తోపాటు, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఆంధ్రులను ఏపీ తీసుకెళ్లి ఓటు వేయించుకోవాలని భావించారు. కానీ, తెలంగాణ, ఏపీలో ఒకేదఫాలో ఎన్నికలు నిర్వహిస్తుండడంతో సెటిలర్లు ఇప్పుడు తెలంగాణ లేదా ఏపీలో మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ, అక్కడ వేయడానికి అవకాశం లేకుండా పోయింది.

 

కొన్ని ఓట్ల తొలగింపు..

మరోవైపు తెలంగాణలో ఓటుహక్కు ఉండి, ఆంధ్రాలో కూడా ఓటరుగా నమోదు చేసుకున్నవారిని ఇటీవలే ఎన్నికల సంఘం గుర్తించింది. ఇలా డబుల్‌ ఓట్లు ఉన్నవారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించింది. అయితే పూర్తిస్థాయిలో తొలగింపు సాధ్యం కాకపోవడంతో ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో ఒకేరోజు తెలంగాణ, ఏపీలో ఎన్నికల నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో డబుల్‌ ఓటు వినియోగించుకోకుండా చేయవచ్చని పోలింగ్‌ ఒకేరోజు పెట్టిందని తెలుస్తోంది.

Posted Under AP
Editor