కరీంనగర్‌ కదనరంగంలోకి కాంగ్రెస్‌ కీలక నేత…

ఇక లోక్‌సభ ఎన్నికల్లో అందరి చూపు కరీంనగర్‌పై ఉంది. సిట్టింగ్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయం. బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రకటించారు. ఇక, అధికార కాంగ్రెస్‌కు అభ్యర్థి కరువయ్యాడు. పోటీకి ఇద్దరు ముగ్గురు దరఖాస్తు చేసుకున్నా.. బండి సంజయ్‌ను ఢీకొట్టే స్థాయి నాయకులు కాదు. జనానికి పెద్దగా పరిచయం కూడా లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం బలమైన నాయకుడి కోసం వేట మొదలు పెట్టింది.

 

రంగంలోకి కాంగ్రెస్‌ కీలక నేత..

రుద్ర సంతోష్‌ కుమార్‌ ఈ పేరు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఒక సెన్సేషన్‌గా మారింది. దశాబ్దకాలంగా కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కీలకంగా వ్యవహరించారు. వార్‌ రూం ఇన్‌చార్జిగా పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎటర్‌ ఇవ్వబోతున్నారు. కరీంనగర్‌ లోక్‌సభలో బండి సంజయ్‌ను ఢీకొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కాంగ్రెస్‌ అధిష్టానం రుద్ర సంతోష్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 

ఎవరీ రుద్ర సంతోష్‌..

కరీంనగర్‌ పార్లమెంటు స్థానానికి రుద్ర సంతోష్‌ పేరు వినిపిస్తుండడంతో ఇపుపడు అందరి చూపు అతడినపై పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ అనుయాయుడిగా, కరీంనగర్‌ జిల్లాలో ఎమ్మెల్యేలు, నాయకులకు ఆప్తుడిగా ఉన్నారు రుద్ర సంతోష్‌. వివాద రహితుడిగా, అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో పాల్గొని వివిధ సమస్యలు రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన మనసు గెలుచుకున్నారు.

 

ఓబీసీ కోఆర్డినేటర్‌గా..

ఏఐసీసీ అధ్యోఉడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ పెద్దల ప్రత్యేక చొరవతో సంతోష్‌ ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినటర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు అధిష్టానం ఆశీస్సులతో కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. దాదాపు టికెట్‌ ఆయనకే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

 

బండి, సంతోష్‌ మధ్యే పోటీ..

రుద్ర సంతోష్‌ బరిలో ఉంటే.. కరీంనగర్‌లో పోటీ బండి సంజయ్, రుద్ర సంతోష్‌ మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై తెలంగాణలో వ్యతిరేకత ఉంది. జాతీయ పార్టీల మధ్యే పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ నిర్వహించిన ఇంటర్నల్‌ సర్వేల్లో బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికే పరిమితమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

Editor