అయోధ్యలో తుది దశకు ఏర్పాట్లు ! కొత్త రైల్వేస్టేషన్ కూడా రెడీ..

అయోధ్యలో భవ్య రామ మందిరం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రధాన గుడితో పాటు ఇతర కట్టడాల నిర్మాణం కూడా పూర్తయింది. జనవరి 22న రామమందిరంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహణకు ఆలయ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహా ఘట్టానికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖుల్ని, సాధువుల్ని, ఆధ్యాత్మిక గురువుల్ని ఆహ్వానించింది. వీరి రాక కోసం భారీ ఎత్తున చేస్తున్న ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకుంటున్నాయి.

 

జనవరి 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవం, పట్టాభిషేక మహోత్సవానికి సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా రాంపథం, భక్తి పథం, సుగ్రీవ కోటలో అలంకరణలు చివరి దశలో ఉన్నాయి. గోడలు టెర్రకోట, చక్కటి మట్టి కుడ్య కళాఖండాలతో అలంకరించారు. ధర్మ మార్గం వైపు గోడలపై రామాయణ సంఘటనలను వర్ణించే కుడ్యచిత్రాలు ఉండబోతున్నాయి. అలాగే గోడలు త్రేతాయుగాన్ని గుర్తుకు తెచ్చే కళాఖండాలతో అలంకరిస్తున్నారు.

 

జనవరి 22న జరిగే ప్రారంభోత్సవ వేడుకకు ముందు ఆలయ ప్రాంగణంలో ప్రతిచోటా పెయింటింగ్, క్లీనింగ్, కళాకృతుల ఏర్పాటు చేస్తున్నారు. సహదత్‌గంజ్‌కు వెళ్లే 13 కిలోమీటర్ల పొడవైన రహదారి, రాంపథ్ పేరుతో ఇప్పుడు 40 అడుగుల వెడల్పుగా మార్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న సంస్థలు, భవనాలు, దుకాణాలకు రంగులు వేశారు. రామ మందిరం ప్రధాన ద్వారాన్ని ‘శ్రీరామ జన్మభూమి మార్గం’గా పిలవనున్నారు. 90 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డులో లైటింగ్, పందిరి పనులు జరుగుతున్నాయి. అలాగే నయాఘాట్ వద్ద ఉన్న రామకథా మ్యూజియంలో కూడా సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.

 

చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రామ్ కీ పౌరీని శుభ్రం చేశారు. పంపింగ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. ప్రతి సాయంత్రం, లేజర్ షో ద్వారా రాముడి గాథను అందరికీ పరిచయం చేస్తారు. అయోధ్యలోని 37 పురాతన దేవాలయాల్ని కూడా పునరుద్ధరిస్తున్నారు. అయోధ్యలో భారీ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ఆధునిక ఆర్కిటెక్చర్, అన్ని సౌకర్యాలతో కూడిన ఈ స్టేషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ స్టేషన్‌కు వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

Editor