తిరుపతి: రెండు రోజుల క్రితం(గురువారం) అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత పులి బోనులో చిక్కింది.
దాడి అనంతరం అలిపిరి మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచారాన్ని గమనించిన అటవీశాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండో బోన్లను ఏర్పాటు చేశారు.
శుక్రవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు తెలిపారు. బోనులో చిక్కిన చిరుత పులిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఒక్కరోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంపై భక్తులు టీటీడీ అధికారులు అభినందిస్తున్నారు. చిరుతను అడవిలో వదిలిపెట్టనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
అలిపిరి నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం మరోసారి పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
రాత్రి 7 గంటల తర్వాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి 200 మంది చొప్పున భక్తులను బృందాలుగా పంపే ఏర్పాటు చేశారు. వీరితోపాటు సెక్యూరిటీ గార్డు కూడా ఉంటారు. చిన్న పిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని అప్రమత్తంగా వెళ్లాలని సూచించారు. అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు.
సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్డులో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై అధికారులో సమాలోచనలు చేస్తున్నారు. కాగా, చిరుత దాడిలో గాయాలపాలైన బాలుడు ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.
